కోల్ ఇండియా‌లో ఉద్యోగాలు... రేపటి నుంచే దరఖాస్తులు ప్రారంభం

  • 640 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు
  • అధికారిక వెబ్‌సైట్‌ లో దరఖాస్తులు సమర్పణకు అవకాశం
ప్రభుత్వరంగ కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి కంపెనీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి (అక్టోబర్ 28) నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ కోల్ఇండియా.ఇన్‌ ద్వారా (coalindia.in) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో మొత్తం 640 ఖాళీలు భర్తీ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. విభాగాల వారీగా మైనింగ్ ఇంజినీరింగ్‌లో 263, సివిల్ ఇంజనీరింగ్‌లో 91, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 102, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 104, సిస్టమ్ ఇంజనీరింగ్‌లో 41, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో 39 ఖాళీలు ఉన్నాయని పేర్కొంది.

బీటెక్/బీఈ చివరి సంవత్సరం పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు అని, వ్యాలిడ్ గేట్ 2025 స్కోర్‌ కూడా ఉండాలని పేర్కొంది. ఇక వయో పరిమితి 30 ఏళ్లు మించకూడదని తెలిపింది. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపింది. గేట్ పరీక్ష స్కోర్‌లను పరిగణనలోకి తీసుకుంటామని, ఆ తర్వాత ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ఉంటుందని తెలిపింది. 

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులకు రూ.1,180గా ఉందని, రిజర్వేషన్ కలిగిన వర్గాలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. కాగా ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Coal India Limited
Job Notifications
job opportunities
job news

More Telugu News